సంపాదకీయం సోయి | 02 మార్చ్ 2007 03:12 am
మూడో మోసం సాగది
- డా. నందిని సిధారెడ్డి
సత్యసాయిబాబా అసత్య ప్రచారానికి దిగిండు. తెలంగాణ వేరు కావాలనుడు మహాపాపమట. న్యాయాన్యాయాల వాదంలో వలసవాదులు ఓడిపోయిండ్రు. సెంటిమెంటు సెంటు రాసీ రాసీ తేలిపోయిండ్రు. అభివృద్ధి తర్కంతో అతకని గుణాంకాలతో చావుదెబ్బలు తిన్నరు. వలసవాదుల అస్త్రాలన్నీ వట్టిపోయినయి. మట్టి గరిచినయి. ఆఖరుకు పాపపుణ్యాల పాతకత్తి తీసిండ్రు. తెలంగాణ ప్రజల గొంతుకోయగల గొప్ప మహిమాన్విత బాబా ఎవరా! అని వెతికిండ్రు. అనుభవ ప్రాధాన్యత గుర్తెరిగి రాయలసీమ బాబా పవిత్రకార్యం చేపట్టిండు.
సాయిబాబా అధ్యాత్మిక ప్రవచనాలతో అలరించిన వాడు కాదు. అచంచలదీక్షాదక్షతతో మెప్పించిన వాడుకూడా కాదు. యాగాలతోనో యోగాలతోనో పాగావేసిన వాడు కూడా కాదు. గారడితో బురిడీకొట్టించి మాయలతో మత్పరించి చెలామణిలోకి వచ్చిన చతురుడు. పాలకుల్ని పాదాక్రాంతుల్ని చేసుకునే ప్రత్యేక నైపుణ్యం ద్వారా, పదవులూ ప్రమోషన్లిప్పించే పైరవీకళద్వారా ప్రపంచ ఖ్యాతికొచ్చినవాడు సత్యసాయిబాబా. ఆయనకెప్పుడూ పేదప్రజల ఆర్తనాదాలతో పట్టింపులేదు. మూడుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో పట్టింపు లేదు. రైతన్నల ఆత్మహత్యలు చూస్తుంటే పాపమనిపించలేదు. ఉసూరుమంటున్న ఊరోల్ల దుఃఖం పాపమనిపించలేదు. నీళ్లు తరలించుకపోతే నిట్టాడుకూలిన గుడిసెల వలవలపోత పాపమనిపిస్తలేదు. కాని తెలంగాణ తన బతుకు తాను బతుకునంటే పాపమట. మహా పాపమట. ఛస్తే ఫరవాలేదు. బతుకుతనంటెనే కష్టం. ప్రభువులకయినా ప్రవక్తలకయినా బతుకుకంటే భక్తి ముఖ్యం. బాబాలకయినా, బాబాముదిరి భగవాన్ అయినా ప్రాంతీయ అభిమానం ఉండి తీరుతుందని సాయిబాబా నిరూపించిండు. రాజూ, బాబా ఒకే పక్షమని చరిత్ర చెప్పిన సత్యాన్ని నిర్ధారించిండు. ఎంత ప్రాంతాభిమానం పరవళ్ళుతొక్కకపోతే తెలంగాణ ప్రజల్ని ఇంత అవమానిస్తడు?
ఏలినవారి బుద్ధులే బుద్ధులు. శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు. దిగ్విజయసింగ్తో వార్నింగ్ వచనాలు చెప్పించిన పెద్దలే సాయిబాబాతోని పాపవచనాలు పలికిస్తున్నరు. పబ్బంగడుపుకునే ప్రణాళికలు ప్రకటిస్తున్నరు. ప్రాంతాలమధ్య తగువులు పరిష్కరించుమంటే జిల్లాల మధ్య తగువులు పెడుతుండ్రు. ఐఐటి ఇచ్చినట్టే ఇచ్చి రెండు జిల్లాల మధ్య చిచ్చుపెట్టిండ్రు. యూనివర్సిటీ ప్రకటించి ఇంకోరెండు జిల్లాలమధ్య లొల్లిపెట్టిండ్రు. రింగ్రోడ్డు జంగ్! రాజధాని రచ్చ! భూముల బూం! జీవోల జగడం, సొరంగం కొట్లాట - వీలయినన్ని మంటలు పెట్టి వీలయినంత కాలం చలికాచుకోవాలని సరికొత్త ఎత్తులు వేస్తుండ్రు. ఫాక్షనిజం నుంచి వికసించిన కండ్లకు పరిపాలనంటే పంచాయిదులు పెట్టుడే అయింది.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న మోసం తెలుసుకుంటున్నరు. తెలంగాణతల్లి రూపకల్పన జరిగితే వశపోక వస పోసుకుంటున్న వలసవాదుల వైఖరి గమనిస్తున్నరు. రెండో ఎస్సార్సీ పేరుతో మూడో మోసానికి పాల్పడుతున్న కుట్రలు గ్రహిస్తున్నరు. ఒత్తిడి మొదలయింది. పొన్నాలతో పొట్లాట, గుట్టలో గుసగుసలు, రాయల తెలంగాణాలు దేనికి నిదర్శనాలు?
తెలిసిందిలే గుట్టు తెలిసింది
తెలంగాణ పట్టు బిగిసింది




on 08 మే 2007 at 9:01 pm 1.ramulu …
తెలంగాణ ఉద్యమకారులను తమ అర్దంలేని ప్రకటనలతో (సమయోచితంకాని ప్రకటనలతో) కెసీఆర్ & నరేంద్రలు యెన్నోసార్లుగాయపరిచారు.మళ్ళీ కేంద్రంలో చేరాలనుకుంటున్న కేసీఆర్ ఆ.ప్ర. ప్రభుత్వంలో చేరిన 6 గురు మంత్రులతో రాజీనామ చేయించారో ,కేంద్రంలోని తామిద్దరు యెందుకు రాజీనామాలు చేసారో తెలంగాణ ప్రజలకు వివరించాల్సి ఉంది.అప్పట్లో వారి రాజీనామాలు చాలామందికి యిష్టమేలేకుండె.కాంగ్రేసువారు పదే,పదే అవమానించినమాట వాస్తవమే ,ఐనా రాష్ట్ర ప్రభుత్వమ్నుండి రాజీనామాలు చేసిన సమయం మాత్రం ఎంతమాత్రం రాజకీయంగా అనుకూలంగా లేకుండె.ఇప్పుడు ఎవరెవర్ని సంప్రదించి అటువంటి విపరీత నిర్నయం తీసుకున్నరో వారు వివరించాలి.ఆయన తీసుకునే అటువంటి విపరీతనిర్నయాలకు తెరాసవారు తలలూపవచ్చుగాక జయశంకర్ గారెందుకు ఊపుతారు? అందరిలాగే ఆయనా & ఇతర విధ్యావంతులు తలలూపిఉంటే ఉద్యమం యెప్పుడో ఎట్లోకలిసేది.తామేంచేసినా ,తమ పార్టీ ఏంచేసినా కరీం నగర్ ఎన్నికల్లో మద్దత్తు ఇచ్చినట్లు ఇస్తూనే ఉంటారనుకుంటే వారంతా పప్పులో కలేసినట్లే లెక్క. తె.ఉద్యమాని ముందుకు తీసికెళ్ళడానికి ఇప్పుడు బిజేపి,సిపీఇ పార్టీలేకాక ఇతరపార్తీలలోని నాయకులు,ఐక్యవేదికవంటి సంస్థలు ఉన్నాయని గుర్తుంచుకొని సరైన దారిలో నడవడం ఇప్పటికైనా మంచిది.
on 08 మే 2007 at 9:20 pm 2.ramulu …
ప్రియ తె.వాదులకు,
కె సి ఆర కె0ద్ర కాబినెట్లొ చెరడన్ని వ్యతిరెకిస్తూ పై విధ0గా రాశాను.ఉద్యమకారుల0తా ఈసొయి పత్రిక ను టిడిఎఫ్ చర్చవెదిక ను ఉపయొగి0చుకున్నట్లు ఉపయొగి0చుకుని పై విష్య0 మీద తమ అభిప్రాయలు రాస్తె బాగుంటు0ది.