సభలు-సమావేశాలు సోయి | 07 జూన్ 2007 04:03 pm
”ధిక్కారం” పుస్తకావిష్కరణ
-రిపోర్టు నల్లెల రాజయ్య
ఏప్రిల్ 20వ తేదీనాడు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అనేక మంది సాహితీ ప్రముఖులు, సాహిత్యాభిలాషుల సమక్షంలో ”ధిక్కారం” పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఒక చారిత్రక సందర్భ విశ్లేషణతో వరవరరావు రాసిన ముందు మాటతో వరంగల్ రచయితల సంఘం పక్షాన నల్లె రాజయ్య, వడ్డెబోయిన శ్రీనివాస్ల సంపాదకత్వం, ఎం.ఎ.బాసిత్ కృషితో ప్రకటించిన ”ధిక్కారం” సామ్రాజ్యవాద వ్యతిరేక కవితా సంకలనాన్ని ప్రముఖ కవి, తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షులు నందిని సిధ్ధారెడ్డి ఆవిష్కరించగా, రచయిత, సాహితీ విమర్శకులు, వీక్షణం వర్కింగు ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ సమీక్షించారు.
ఆవిష్కర్త నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఒక పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం చాలా కష్టం. అటువంటి పనిని భుజానికెత్తుకొని ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చిన నల్లెల రాజయ్య, వడ్డెబోయిన శ్రీనివాస్, బాసిత్లకు అభినందనలు. అమెరికా సామ్రాజ్యవాదం ఎవరినీ మాట్లాడనివ్వటం లేదు. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించిన ఎంతటి వ్యక్తులనైనా ఉరి తీద్దామనే అమెరికా దురహంకారం గర్హనీయమన్నారు. ఉరి చరిత్రగా నిలిచిపోతుందని అనే దానికి భగత్ సింగు ఉరి తార్కాణమన్నారు. అమెరికాను ఎదురించే ఏకైక శక్తిగా సద్దాంను గుర్తించవచ్చు. 1993 కంటే 2007 నాటికి అమెరికా వ్యతిరేకభావం ఎక్కువైంది. సద్దాం ఉరి చాలామంది కవులకు ప్రేరణ అయింది. ఆత్మగౌరవానికి నిదర్శనం సద్దాం. వరంగల్ కవులు మరియు వాళ్ళ కవిత్వం చరిత్రలో భాగమవుతుందని సిధారెడ్డి అన్నారు.
ఎన్. వేణుగోపాల్ పుస్తకాన్ని సమీక్షిస్తూ ధిక్కారానికి ఈ ఓరుగల్లు ఒక వీరుడు మరణిస్తాడు. అతని చరిత్ర ప్రారంభమవుతుంది. యుద్ధనౌకగా సామ్రాజ్యవాద దురహంకారానికి చేయి అడ్డం పెట్టి ధిక్కరించిన సద్దాంను గౌరవిస్తున్నాం. అతనికేవైనా లోపాలుంటే అతని చివరి ధిక్కారం ప్రక్షాళన చేసింది. 15 సంవత్సరాల క్రితం జరిగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భారత దేశ చక్రవర్తి బహదూర్షా జాఫర్ను బంధించి ఎటువంటి అధికారాలు లేని ఈస్టిండియా కంపెనీ బహదూర్ షాను దేశద్రోహ నేరంపై విచారించి శిక్ష విధించినట్లే ఈ నాడు సద్దాం హుస్సేన్ వంటి దేశాధినేతను పరాయి దేశమైన అమెరికా అదేవిధంగా ఉరిశిక్షకు గురి చేసింది. చంపటానికో సాకు చూపించి అమెరికా సద్దాంను చంపింది. సామ్రాజ్యవాదమనేది అన్నింటికన్నా పెద్ద ప్రమాదం. ఇది ప్రపంచీకరణ అనే తటస్థ పేరుతో 20 సంవత్సరాలుగా తృతీయ ప్రపంచదేశాల మీద జరుగుతున్న దుర్మార్గాన్ని అర్థం చేసుకున్న స్థితిలో గుడ్డిగా సంతకం చేయకుండా ఇరాక్ ధిక్కరించింది.
ఇటువంటి చారిత్రక సందర్భంలో తెలుగులోనే సద్దాం మీద పెద్ద ఎత్తున కవిత్వం వచ్చింది. వరంగల్ అటువంటి ధిక్కారానికి ఒక ప్రతీక. సామ్రాజ్యవాద విధానం అనేది పెట్టుబడి విధానం యొక్క ముదిరిన ఒక రూపం. దీనికి తెలిసింది కొనుగోలుదారు, అమ్మకందారు మాత్రమే. దుర్మార్గమైన ఈ వ్యాపార నీతిని ఎండగట్టడమే ధిక్కారం. సామ్రాజ్యవాదపు విషపు విత్తనం మహావృక్షంగా ఎదిగి మహారాక్షసిగా కనబడుతున్నప్పటికి ఈ ధిక్కారానికి అది క్రుళ్ళి నశించిపోతుందని వేణుగోపాల్ హెచ్చరించారు.
సభాధ్యక్షుడు నల్లెల రాజయ్య మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం భగత్ సింగును ఉరితీస్తే ఈ నాటి అమెరికా సామ్రాజ్య వాదం సద్దాం హుస్సేన్ను ఉరితీయడం చారిత్రక విషాదకర పరిణామంగా భావించాలని అంటూ. అందుకే ఈ ”ధిక్కారం” కవితా సంకలనాన్ని ”షహీద్ భగత్ సింగు”కు అంకితం ఇస్తున్నామని ప్రకటించారు.
సమావేశ కర్త ఎమ్.ఎ. బాసిత్ సద్దాం ఉరితీతకు ఒక చారిత్రక సందర్భంలో ఎటువంటి ప్రాధాన్యత ఉందో ఆవిష్కకర్త, సమీక్షకులను విశ్లేషించవలసిందిగా కోరినారు.పిట్ల సాంబయ్య గారి వందన సమర్పణతో ముగిసిన ఈ సభలో మానవహక్కుల వేదిక అధ్యక్షులు బుర్రా రాములు, డి.టి.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. గంగాధర్, జిల్లా అధ్యక్షులు బి. నర్సయ్య, టి. లింగారెడ్డి, సుధీర్బాబు, ప్రజాసంఘాల బాధ్యులు ఎస్. అనిత, తనూజ, రమాదేవి, కట్టయ్య, ఫ్రాన్సిస్, సాహితీవేత్తలు పి. వీరబ్రహ్మచారి, రామా చంద్రమౌళి, వలిగొండ కాంతారావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వి.ఆర్. విద్యార్థి, గుండెబోయిన శ్రీనివాస్, తంగెళ్ళ సుదర్శన్, ఎం. రవీందర్, ఉదయ్సింగు, సయ్యద్ ఖుర్సిద్, టి. వెంకట్రాం నర్సయ్య, సాహిత్యాభిలాషులు అనేక మంది పాల్గొన్నారు.



