పక్రటనలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:25 pm
పతిక్రా పక్రటనలు
పోసాని మురళీ కృష్ణ దర్శకత్వంలో “ఆపరేషన్ దుర్యోధన” చిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను, సంస్కృతిని కించపరుస్తూ, అవహేళన చేస్తూ సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రా సినీ పెట్టుబడిదారుల దురంహకారానికి ఈ సంభాషణలు, సన్నివేశాలు నిదర్శనాలు. ఈ దురంహాకార పూరిత వైఖరిని తెలంగాణ రచయితల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.
తెలంగాణ ప్రజలను, సంస్కృతిని, ఉద్యమాన్ని కించపరస్తున్న సన్నివేశాలను, సంభాషణలను వెంటన్ చిత్రంలోంచి తొలగించవలసిందిగా “దుర్యోధన” నిర్మాత, దర్శకులను డిమాండ్ చేస్తున్నాం. ఈ సన్నివేశాలు, సంభాషణలు తోలిగించే వరకు తెలంగాణలో ఈ చిత్రం ప్రదర్శనలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదే విధంగా దర్శక, నిర్మాతలు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణ అన్ని జిల్లాల తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు “దుర్యోధన” సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ల ముందు నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని పిలుపునిస్తున్నాం.
తెలంగాణ భాష, సంస్కృతి అంగడి సరుకు కాదని వేల సంవత్సరాల ఉమ్మడి వారసత్వమని, తెలంగాణ భాషా సంస్కృతులను కించపరిస్తే సహించే ప్రసక్తి లేదని కోస్తాంద్ర సినీ పెట్టుబడిదారులను ఈ సందర్భంగా మేం హెచ్చరిస్తున్నాం.
- తెలంగాణ రచయితల వేదిక తేది 4.6.2007
* * *
హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బెంగాలి (బంగ్లాదేశ్) రచయిత్రి తస్లీమా నస్రీన్పై మజ్లిస్ ఎమ్మెల్యేల అమానుషదాడిని తెలంగాణ రచయితల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. బంగ్లాదేశ్లో మెజారిటి ఫాసిస్టు మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ‘లజ్జ’ లాంటి నవలలు రాసినందుకు బంగ్లాదేశ్ ఇస్లామిక్ మతోన్మాదం తస్లీమాను దేశ బహిష్కరణకు గురిచేసింది. ఇక్కడ భారతదేశంలో ఫాసిస్టు హిందూ మతోన్మాదాన్ని లౌకిక ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంగా ఎదుర్కోవల్సిన ఈ సందర్భంలో మజ్లిస్ ఇటువంటి మతోన్మాద దాడులకు పాల్పడడం అమానుషం. ఇది రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులను, లౌకిక వాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. లజ్జతో తలదించేసుకోవాల్సిన ఈ చర్య హైదరాబాదీ ‘తహజీబ్’కు, తెలంగాణ సహనశీల సంస్కృతికి వ్యతిరేకం. దేశంలో ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యతకు ఇటువంటి మతోన్మాదదాడులు భంగం కలుగజేస్తాయని మజ్లిస్కు మేం హెచ్చరిస్తున్నాం.
‘నీ అభిప్రాయాలతో నేను విభేదిస్తున్నప్పటికీ నీ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం ప్రాణం అర్పిస్తాను’ అన్నది ఇవ్వాల్టి ప్రజాస్వామిక యుగంలో మనందరి ఆదర్శం కావాలని వేదిక భావిస్తున్నది. ఈ దాడి తస్లీమా భావప్రకటనా స్వేచ్ఛమీద జర్గిన దాడిగా భావిస్తూ ఆమెకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. తస్లీమాపై దాడికి పాల్పడిన దుండగులపై చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో లౌకిక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- తెలంగాణ రచయితల వేదిక, తేది 9.8.2007



